పట్టించిన సిరా గుర్తు

19 Apr, 2019 12:21 IST|Sakshi

పలు ప్రాంతాల్లో రెండోసారి ఓటుకు యత్నించిన ఇతర రాష్ట్రాల ఓటర్లు

కర్ణాటక, బనశంకరి : లోకసభ ఎన్నికల నేపథ్యంలో మొదట విడత పోలింగ్‌ జరిగిన వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం రెండో విడత పోలింగ్‌లో బెంగళూరు నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి యత్నించి కొందరు పట్టుబడ్డారు. యలహంక, యశవంతపుర, రాజరాజేశ్వరినగర తదితర ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నిమిత్తం బెంగళూరు నగరంలో స్ధిరపడిన చాలామంది ఓటర్లు ఈనెల 11 తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మొదటవిడత ఎన్నికల్లో తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని బెంగళూరు నగరానికి చేరుకున్నారు. గురువారం బెంగళూరు నగరంలో జరుగుతున్న రెండో విడత పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించారు.

ఇప్పటికే వారి చేతి వేలికి వేసిన సిరా గుర్తును గమనించిన ఎన్నికల అధికారులు రెండో ఓటుహక్కు వినియోగించుకోవడానికి నిరాకరించారు. యలహంకలో ఇలాంటి కేసులు చోటుచేసుకోగా సుమారు 13 మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించగా వారి ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా 11 మంది పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  తాము చేనేత కార్మికులుగా పనిచేస్తున్నామని 11న జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నామని తెలిపారు. బెంగళూరు ఓటరు జాబితాలో తమ పేరు ఉండటంతో దీంతో ఇక్కడ కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చామని తెలిపారు.

దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యలో ఇలాంటి గందరగోళ సంఘటనలు తలెత్తాయి. మొదటి దశ పోలింగ్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లు మరోసారి నగరంలో ఓటుహక్కు వినియోగించడానికి యత్నించి పట్టుబడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌. అరుణాచల్‌ప్రదేశ్‌. అస్సాం, బీహర్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, ఒడిస్సా, సిక్కిం, తెలంగాణా, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లోని చాలామంది ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్ధిరపడ్డారు. అక్కడ తమ ఓటుహక్కు వినియోగించుకుని ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల అధికారులు ముందుజాగ్రత్తగా అధికారులకు సూచించారు. దీంతో రెండోసారి ఓటుహక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు