మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు చెంప పెట్టు

20 Oct, 2014 02:31 IST|Sakshi
మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు చెంప పెట్టు

కంప్లి : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పి బీజేపీకి పట్టం కట్టారని ఎంపీ శ్రీరాములు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీరాములు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవినీతి పాలనపై ప్రజలు కన్నెర్ర చేశారని తెలిపారు.
 
ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పారన్నారు. దేశంలో నరేంద్రమోడీ గాలులు బలంగా వీస్తున్నాయని, వాటిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు. యూపీఏ హయాంలో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అది గ్రహించే ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొడుతున్నారన్నారు. త్వరలో గ్రామ, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు రానున్నాయని, బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపినిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు కేఎస్.భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు