ఏఐటీయూసీ అంచనాలు తారుమారయ్యేనా?

28 Nov, 2016 12:20 IST|Sakshi
ఏఐటీయూసీ అంచనాలు తారుమారయ్యేనా? l
వరుసగా ఐదుసార్లు గుర్తింపు సంఘంగా గెలుపు
ప్రతీసారి కీలకంగా మారిన 21ఇన్ క్లెన్
నాలుగు నెలల్లో గని మూసివేత
ఐదు నెలల తర్వాతే ఎన్నికలు
ఈ సారి గెలుపు ప్రశ్నార్థమేనా?
 
 
సింగరేణి పుట్టినిల్లు అయిన బొగ్గుట్టలో ప్రస్తుతం 21ఇన్‌క్లైన్‌ గని మాత్రమే ఉంది. అది కూడా మరో నాలుగు నెలల్లో మూసివేసే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ ప్రభావం స్థానిక అభివృద్ధి, కార్మికులతో పాటు త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలపైనా పడనుంది. మరో ఐదు నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వరుసగా ఐదుసార్లు గుర్తింపు సంఘంగా గెలుస్తూ వస్తున్న ఏఐటీయూసీ అంచనాలు తారుమారు కానున్నాయి.
 
ఇల్లెందు అర్బన్: సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికలు నెలల తరబడి వాయిదా పడుతూ వస్తున్నాయి. నవంబర్‌ నెలలో నిర్వహిస్తారనుకున్న ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, సీఎం ప్రకటించిన వారసత్వహక్కు అమలుకు సంబంధించిన సర్కులర్‌ రాకపోవడం, కోడ్‌ఆఫ్‌ డిసిప్లేన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను మరో ఐదు నెలల వరకు నిర్వహిం చరనే ప్రచారం జరుగుతోంది. 21 ఇన్ క్లెన్ లో ప్రస్తుతం 452మంది కార్మికులు పని చేస్తున్నారు. గనిని 2017 మార్చి నాటికి మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు అధికారులు ఇప్పటికే పలు దఫాలు మీడియా ఎదుట ప్రకటించిన విషయం తెలిసిందే. 21ఇన్ క్లెన్ లో 80శాతం ఏఐ టీయూసీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆ యూనియన్ నేతలు చెబుతుంటారు. వరుసగా ఐదుసార్లు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచింది. ఈ గెలుపులో 21 ఇన్ క్లెన్ గని కార్మికులే కీలకంగా మారిన విషయం స్థానికంగా ప్రచారంలో ఉంది. జేకేఓసీలో 308, కేఓసీలో దాదాపు 60 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎస్‌అండ్‌పీసీ, ఏరియా వైద్యశాల, వర్క్‌షాపు, స్టోర్, తదితర విభాగాల్లో 800 మంది కార్మికులు విధులు చేస్తున్నారు. 21ఇన్ క్లెన్ మినహా విభాగాల్లో, ఓసీల్లో టీబీ జీకెఎస్, హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సమపాలల్లో ఉంటారు. 21ఇన్ క్లెన్ గని మూసివేస్తే ఇక్కడి కార్మికులందరూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళతారు. గని మూసివేత వల్ల స్టోర్, ఏరియా వర్క్‌షాపు, ఏరియా వైద్యశాల, జీఎం కార్యాలయాలను కూడా ఎత్తివేయనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సుమారు 600 మంది కార్మికులు కూడా బదిలీ కానున్నారు.  ఇక మిగిలింది జేకే–5ఓసీ, కేఓసీ, ఎస్‌అండ్‌పీసీ విభాగాలతో పాటుగా ఒకటి రెండు చిన్న విభాగాల కార్మికులు మాత్ర మే.. వీరి ఓట్ల ఆధారంగానే స్థాని కంగా యూనియన్ల గెలుపు ఆధారపడి ఉంటుంది.
 
>
మరిన్ని వార్తలు