తిరువొత్తియూరు, న్యూస్లైన్ : రాష్ట్రంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. మొత్తం 7 సవర్ల బంగారు నగలు, 3 పంచ లోహ విగ్రహాలు చోరీ అయ్యాయి. చెన్నై, ఉల్లగరం ద్రౌపతి అమ్మవారి ఆలయ వీధికి చెందిన బాల సుబ్రమణ్యం (62) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.
ఆయన తన భార్య మహేశ్వరి (52 నగలను స్టేట్ బ్యాంకు లాకర్లో ఉంచారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని బుధవారం పూజలో ఉంచేందుకు మంగళవారం బ్యాంకుకు వెళ్లి లాకర్లో ఉన్న నగలను ఇంటికి తీసుకువచ్చారు. వాటిని స్కూటీ సీటు కింద ఉంచి తాళం వేశారు. ఆ సమయంలో దంపతులకు శరీరంలో దురద ఏర్పడింది. దీంతో వారి సమీపంలో ఉన్నదుకాణం వద్దకు వెళ్లి నీటిని తీసుకుని చేతులు ముఖం శుభ్రం చేసుకున్నారు. దురద తగ్గక పోవడంతో తాను ఆటోలో ఇంటికి వెళతానని, నగలు తన చేతికి ఇవ్వమని మహేశ్వరి భర్తను కోరింది. దీంతో నగల కోసం సీటు పై కెత్తారు. ఆ సమయంలో అక్కడ నగలు లేక పోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు దురద ఏర్పడే పౌడర్ను చల్లి నగలు కాజేసినట్టు బాల సుబ్రమణ్యం అనుమానించారు. నగలు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పంచలోహ విగ్రహాలు మాయం..
కడలూరు జిల్లా కాట్టు మన్నార్ కోవిల్ సమీపం వేలంపూండికి చెందిన వ్యక్తి మరుదు ముత్తు (61). ఇతని ఇంటి వెనుక వైపున నాలుగు తరాలుగా పేచ్చాయి, మరుదవీరన్, ఇడుంబన్ తదితర పంచలోహ విగ్రహాలను ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తున్నారు. సంవత్సరానికి ఒక సారి వీటినిబయటకు తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరుదుముత్తు మనమరాలు విజయలక్ష్మి దేవతా విగ్రహాలకు పూజలు చేసేందుకు గదిలోకి వెళ్లింది.
అక్కడ ఆ సమయంలో మూడు విగ్రహాలు మాయమయ్యాయి. ఈ సంగతిని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కాట్టుమన్నార్ కోవిల్ పోలీసులుకేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నారు.