‘షి’ ఈజ్‌ రన్‌

18 Mar, 2019 10:39 IST|Sakshi

ఉత్సాహంగా ‘షీటీమ్స్‌’ రన్‌

హాజరైన గవర్నర్, సీఎస్, డీజీపీ, పోలీస్‌ ఉన్నతాధికారులు  

‘వీఆర్‌–1’కు అనూహ్య స్పందన  

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 10కే, 5కే, 2కే రన్‌ నిర్వహించారు.ఆదివారం ఉదయం నెక్లెస్‌ రోడ్డులో ‘వీఆర్‌1’ పేరుతో జరిగిన పరుగులో గవర్నర్‌ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.సినీనటి పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

శ్రీనగర్‌కాలనీ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10కే, 5కే, 2కే రన్‌లను ఘనంగా నిర్వహించారు. ‘వీఆర్‌–1’ పేరుతో జరిగిన ఈ పరుగును నెక్లెస్‌ రోడ్డులో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. నగర సీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్, అడిషినల్‌ సీపీ (క్రైమ్స్‌) శిఖా గోయల్, రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, అమెరికన్‌ కాన్సులేట్‌ క్యాథరిన్‌ హడ్డా, హీరోయిన్స్‌ నిహారిక, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అతిథులంతా 2కే రన్‌లో పాల్గొని రన్‌లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రన్‌ ప్రారంభ వేదిక వద్ద గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో దిగ్విజయంగా విజయాలు సాధిస్తున్నారని, నగరంలో మహిళలతో పాటు అందరికీ భద్రత ఉందన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌ సేప్టీ నగరమని, ఎవరైనా ఇక్కడ సంతోషంగా నిర్భయంగా జీవించవచ్చునన్నారు. శిఖా గోయల్‌ ‘ఉమెన్‌ సేఫ్టీ’తో పాటు పలు విభిన్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఇటీవల ఓ అమెరికన్‌ సంస్థ సర్వేలో హైదరాబాద్‌ మహానగరం సేఫ్టీ సిటీగా నిలిచిందని గుర్తుచేశారు. లక్డీకాపూల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీ విద్యార్థులు రన్‌లో పాల్గొని గాంధీజీ 150 జయంతోత్సవాల సందర్భంగా గాంధీజీ సూక్తుల బుక్‌లెట్‌లను పంపిణీ చేశారు. ఈ రన్‌లో విదేశీయులు, బ్లేడ్‌ రన్నర్‌లు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు