లాటరీ పద్ధతిలోనే షాపులు

15 Jun, 2014 04:20 IST|Sakshi
లాటరీ పద్ధతిలోనే షాపులు

- పాత ఎక్సైజ్  విధానంలోనే కేటాయింపు
- ఈ నెల 21వరకు  దరఖాస్తుల స్వీకరణ
- 23న కలె క్టర్  ఆధ్వర్యంలో డ్రా
- ఒక్కో దరఖాస్తుకు రూ.25 వేల ఫీజు

మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఈ మారూ మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్ధతిలోనే కొనసాగనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు పరుస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ఉత్తర్వులు శనివారం జిల్లాకు చేరాయి. ఈ మేరకు అధికారులు షాపుల కేటాయింపు విధానానికి కసరత్తు చేయనున్నారు.ప్రస్తుతం జిల్లాలో 184 మద్యం షాపులు, ఏడు బార్‌లున్నాయి. వీటిని 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించనున్నారు. అప్పట్లో 50 వేల నుంచి 3లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో  ఒక్కో మద్యం దుకాణానికి రూ.42 లక్షలు,50 వేలకు పైగా ఉన్న ప్రాంతాలకు  34 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలలో 32.5 లక్షలు లెసైన్స్ ఫీజులను శ్లాబ్‌ల వారీగా నిర్ణయించారు. ఈనెల 30 తో మద్యం దుకాణాలకు లెసైన్స్‌ల గడువు తీరనుంది.
 
194 మద్యం దుకాణాలకు....
2014-15 సంవత్సర ఎక్సైజ్ పాలసీని  రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎక్సైజ్‌శాఖా మంత్రి పద్మారావ్ ప్రకటించారు.గతంలో జిల్లాలో194 మద్యం షాప్‌లకు గాను  184 మద్యం షాప్‌లకు  అధికారులు లాటరీ పద్దతిన వైన్‌షాప్‌లను ఎంపిక చేశారు.అప్పుడు మిగలిన 10 షాప్‌లతో కలిపి జూలైలో  కొత్త విధానం ప్రకారం వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ పరిధిలో మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో వనపర్తి, అచ్చంపేట, ఆమన్‌గల్, కల్వకుర్తి, కొల్లాపూర్  స్టేషన్లు  ఉన్నాయి.

ఈ ప్రాంతాలలో పరిధిలో 57 వైన్ షాపులు ఉన్నాయి. గద్వాల డివిజన్ పరిధిలో కొత్తకోట, కొడంగల్, ఆత్మకూర్, నారాయణపేట, అలంపూర్‌లలో ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో 62 వైన్ షాపులు, రెండు బార్‌లున్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో షాద్‌నగర్, కొడంగల్, జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో 65 వైన్ షాపులు, ఏడు బార్‌లున్నాయి.  2012 సంవత్సరంలో డ్రా పద్ధతిన దుకాణాలను కేటాయించారు.  

ఏడాది తర్వాత అవే దుకాణాలను రెన్యువల్ చేశారు. ఈనెల 30 తో వాటి గడువు ముగుస్తుంది. టెండర్ల సమయంలో జిల్లా నుంచి 55 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంలో నిర్వహించిన మాదిరిగానే 7 విడతలలోనే మద్యాన్ని సరఫరా చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కొత్త పాలసీ ప్రక్రియను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రతీ దరఖాస్తుకు 25వేల ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 23న లాటరీ పద్ధతిన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు