బాబు అసలు రంగు బయటపడింది

11 Jun, 2015 00:04 IST|Sakshi

 హైదరాబాద్: నీతి, నీజాయతీల్లో అన్నాహజారే వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు అసలు రంగు ఓటుకు నోటు కేసుతో బయట పడిందని వైఎస్సార్ సీపీ సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు వెళుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు...చేసేవి అవినీతి పనులని ప్రజలకు అర్ధమైందన్నారు. చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
 
 చట్టం తమ చేతుల్లో ఉందనే ధోరణిలో ఏది చేసినా నడుస్తుందనుకుంటే ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. డబ్బు రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. నిజాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరనడానికి ఓటుకు నోటు కేసే నిదర్శనమన్నారు.
 
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి నేతకు పట్టం కట్టామా? అని ప్రజలు బాధ పడుతున్నారన్నారు. బాబు తన పదవికి రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు.
 

మరిన్ని వార్తలు