పథకాల అమల్లో రాజీ లేదు

24 Sep, 2019 01:47 IST|Sakshi

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలు వచ్చినా.. రాష్ట్రంలో ఆర్థిక మాధ్యం ఏర్పడినా, కేంద్రం రాష్ట్రానికి అందించాల్సిన నిధలకు కోతపెట్టినా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని, వీటి అమలులో రాజీపడమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట పట్టణాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అలాగే ఉమ్రాకు వెళ్లే 40 మంది ఇమామ్, మౌజమ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ జీవన చిత్రానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు. ఈ పండగ సందర్భంగా ఎంతటి పేదవారైనా తమ ఆడపడుచులకు కొత్త చీరె కొని ఇస్తారని, కొత్త చీరెకట్టుకొని బతుకమ్మను పట్టుకొని వెళ్లే ఆడపడుచులు మురిసి పోతారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బతుకమ్మ పండుగకు కొత్త చీరెలను పంపిణీ చేసి, ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దన్నగా మారారని హరీశ్‌ అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల బతుకు మార్చేందుకు బతుకమ్మ చీరెల తయారీ బాధ్యత వారికి అప్పగించామన్నారు.  

విపక్షాల విమర్శలు శోచనీయం  
రాష్ట్రంలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే అభినందించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి హరీశ్‌ అన్నారు. తెలంగాణలో మసీదుల నిర్వాహణ కష్టంగా మారిన రోజుల్లో నేను అండగా ఉంటానని కేసీఆర్‌ భరోసా కల్పించారని చెప్పారు. దీనిలో భాగంగానే మౌజమ్, ఇమామ్‌ల భృతిని రూ. 5వేలకు పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు