‘మా బిడ్డను ఆదుకోండి’

21 Sep, 2019 09:53 IST|Sakshi
మాట్లాడుతున్న రాజేందర్‌రెడ్డి

సాక్షి, పంజగుట్ట: కేన్సర్‌తో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఏడేళ్ల వయసులో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి ఎముకల కేన్సర్‌తో అవస్థలు పడుతుండడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఉన్న ఒక్క ఎకరం భూమి అమ్మి, అప్పులు చేసి వైద్యం చేయించామని వారు తెలిపారు. వైద్యులు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స చేయాలని చెబుతున్నారని, అందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు.

వివరాలు.. తాండూర్‌లోని బక్నారం గ్రామానికి చెందిన వర్రె రాజేందర్‌రెడ్డి, మల్లేశ్వరి దంపతులు. వీరు బతుకుదెరువు నిమిత్తం పటాన్‌చెరు పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో నివసిస్తున్నారు. రాజేందర్‌రెడ్డి సెక్యూరిటీ గార్డు కాగా.. మల్లేశ్వరి స్వీపర్‌గా పని చేస్తోంది. వీరికి మదన్‌రెడ్డి (7) కొడుకు ఉన్నాడు. మదన్‌రెడ్డి పుట్టిన సంవత్సరానికే అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా చికిత్స చేయిస్తూ ఉండడంతో మదన్‌రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. 2016లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించగా బోన్‌ కేన్సర్‌ అని తేలింది. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని సిటిజన్‌ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. 

మరిన్ని వార్తలు