రాష్ట్రంలో మరో 21 సఖి కేంద్రాలు

29 Sep, 2017 01:18 IST|Sakshi

ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సఖి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడం, న్యాయ సహా యం అందించడం, లైంగిక వేధింపుల బారిన పడిన మహిళలను ఆదుకోవడంతో పాటు వైద్య చికిత్సను సఖి కేంద్రాల్లో పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ సైతం వీటి ద్వారానే కొనసాగుతోంది. పూర్వపు పది జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున సఖి కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రా నికి ప్రతిపాదనలు సమర్పించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా 21 సఖి కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కొత్త కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేద్దాం..?
కొత్తగా ఏర్పాటు చేయనున్న సఖి కేంద్రాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై కేంద్రం స్పష్టత కోరింది. ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సఖి కేంద్రాల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఆమె స్పం దిస్తూ పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొత్త కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10 కేంద్రాలు దాదాపు జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రుల ఆవరణలోగానీ, వాటి సమీపంలోగానీ ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త కేంద్రాలను సైతం జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా భవనాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రాల ఏర్పాటుకు స్థలాలు ఖరారైన వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. ఒక్కో కేంద్రానికి గరిష్టంగా రూ.50 లక్షలు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు