సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు

13 Jul, 2016 01:41 IST|Sakshi

 శేకూరు(చేబ్రోలు): ఓ సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 25రోజుల తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన  చేబ్రోలు మండలం శేకూరుపాలెంలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...
 
  శేకూరుపాలెంకు చెందిన నెమలికంటి సురేష్‌బాబు (37) నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం లోయపల్లి ప్రాంతంలో ఓఎన్‌సీ ప్రైవేటు లిమిటెడ్ నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్‌కు సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 10వ తేదీన శేకూరుపాలెం వచ్చిన సురేష్‌బాబు అక్కడ విధులు నిర్వహించటం కష్టంగా ఉందని, కంపెనీ ఎండీ, జీఎంలు తనపై కక్ష పెట్టుకున్నట్టు భార్యకు తెలిపారు.
 
 నెల జీతం తీసుకుని రాజీనామా చేసి వస్తానని కూడా తెలిపినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, గతనెల 15వ తేదీన గుండె నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సురేష్‌బాబు మృతిచెందినట్టు అక్కడ కంపెనీ యాజమాన్యం తెలిపింది.  బిల్డింగ్ మెట్లపై పడిపోయిన సురేష్‌బాబును స్థానిక  ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, తరువాత వరంగల్లు తీసుకుని వెళ్లినట్లు కంపెనీ వారు చెబుతున్న మాటల్లో విశ్వసనీయత లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 16వ తేదీన మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చి 17వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు.
 
 మృతదేహం ముఖంపై గాయాలు, శరీరం అంతా నల్లగా మారిపోవటంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నెమలికంటి చిన్ని వరంగల్లు పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ కమిషన్,మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మెడికల్ ఫోరెనిక్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్  శేకూరుపాలెం శ్మశాన వాటికలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. వరంగల్లు పోలీసులతో పాటు, చేబ్రోలు ఎస్‌ఐ కె.ఆరోగ్యరాజు, తహశీల్దారు కె.శివరామప్రసాద్, మతుని కుటుంబసభ్యులు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు