కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ విందు!

4 Jul, 2017 12:41 IST|Sakshi
కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ విందు!

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విందు ఇచ్చారు. జలవిహార్‌లో ఏర్పాటుచేసిన ఈ విందు కార్యక్రమానికి కోవింద్‌తోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పలువురు బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినందుకు టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కోవింద్‌కు మొదట మద్దతు ప్రకటించిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్‌ఎస్‌ అని మెచ్చుకున్నారు. కోవింద్‌ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని, గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉందన్నారు. రాష్ట్రపతి పదవికి కోవింద్‌ సరైన వ్యక్తి అని వివరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జేడీయూ, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు తదితర ఎన్డీయేతర పార్టీలు కూడా కోవింద్‌కు మద్దతు తెలిపాయని తెలిపారు. కేసీఆర్‌ ఏర్పాటుచేసిన విందును స్వీకరించిన అనంతరం కోవింద్‌ విజయవాడకు పయనం కానున్నారు.