బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను సమతుల్యం చేసుకుంటూనే ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేసేలా 2018–19 బడ్జెట్ అంచనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడేలా బడ్జెట్ పూర్తి సమతుల్యంతో ఉందన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని బడ్జెట్ కూర్పు సాధించిందన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం సంతోషకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుకు పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు అధిక నిధులు సమకూర్చడం ద్వారా తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి బడ్జెట్ అవకాశం కల్పించిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు పరిచేందుకు వార్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులను సీఎం అభినందించారు.