నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

22 Jun, 2020 01:11 IST|Sakshi

కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి పరామర్శ

సాక్షి, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ విద్యానగర్‌లో  ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నగదు, సంతోషికి గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగానికి సంబం ధించిన ఉత్తర్వులను సీఎం వారికి అందజేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 

>
మరిన్ని వార్తలు