సప్త పథం

8 Feb, 2015 04:17 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాచమార్గాల నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా.. రయ్య్‌న దూసుకెళ్లేందుకు వీలుగా వివిధ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. దీనికి అధునాతన స్కైవేలు.. ఎక్స్‌ప్రెస్ కారిడార్లు.. మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు అవసరమని భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తొలిదశలో రూ.1250 కోట్లతో వీటిని నిర్మించనున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
 ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అత్యధిక ప్రాధాన్యం కలిగిన ఏడు ప్రాంతాల్లో పనులకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడింటిలో అత్యధిక రద్దీ కలిగిన ఐదు జంక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలాం టి ట్రాఫిక్ ఆంక్షలు... రెడ్ సిగ్నళ్లు లేకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటిలో ఫ్లై ఓవర్లు... అండర్‌పాస్‌లు.. రహదారి విస్తరణ.. ఇలా అవసరానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటికి దాదాపు రూ.1225 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమిక అంచనా.
 
 ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ, దిగువ వరుసలో కానీ రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాల్సి ఉంది. వీటిలో జీహెచ్‌ఎంసీ మార్గాలు కొన్ని కాగా... ఆర్‌అండ్‌బీ పరిధిలో కొన్ని ఉన్నాయి. ఎల్‌బీనగర్, ఉప్పల్, బాలానగర్, రసూల్‌పురా జంక్షన్లు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నాయి. అక్కడ ఎలాంటి పరిష్కార ‘మార్గం’ చూపుతారో తేలాల్సి ఉంది.   జీహెచ్‌ఎంసీ చేపట్టనున్న వాటిలో దుర్గం చెరువు బ్రిడ్జి, కేబీఆర్ పార్కు జంక్షన్లు, జీవ వైవిధ్య పార్కు నుంచి కూకట్‌పల్లి మార్గం ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు రాచమార్గం నిర్మించనున్నారు.
 

మరిన్ని వార్తలు