తరుముకొస్తున్న కరోనా!

29 Mar, 2020 03:01 IST|Sakshi

‘సామాజిక దూరం..’ పట్టించుకోని ప్రజలు

ప్రధాని, సీఎం హెచ్చరిస్తున్నా మారని తీరు

నిత్యావసరాల కోసం మార్కెట్లలో గుంపులు

హైదరాబాద్‌లో పరిస్థితి మరీ దారుణం

లాక్‌డౌన్‌ లక్ష్యం నీరుగారుతోందని నిపుణుల ఆందోళన

కఠిన ఆంక్షలు విధించాలని సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి కరోనాను నియంత్రించే పద్ధతి గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జ నం చెవికెక్కటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు జోడించి అ ర్థించినా ప్రజల తీరు మారటం లేదు. లాక్‌డౌన్‌కు సంబంధించి కఠిన ఆంక్షలు విధించినా నిత్యావసర వస్తువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా రు. మార్కెట్లు, మెడికల్స్‌ ఎదుట గుంపులుగా పోగ వుతూ సాధారణ రోజులను తలపిస్తున్నారు. ఇప్పు డు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిణ మించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే పక్షం రోజులు మనకు కీలక తరుణం. జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని, మీరైనా జాగ్రత్త పడండంటూ ఇటలీ, స్పెయిన్‌ దేశాలకు చెందిన పౌరులు మన దేశానికి సూచిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఉదయం ఆరుకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత రోడ్లు ఖాళీగా మారి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్‌డౌ న్‌ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నా రు. ప్రస్తుతం రెండో దశలో ఉన్న కరోనా వ్యాప్తి, మూడో దశకు చేరుకుంటే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదని గట్టిగానే హెచ్చరిస్తున్నా చాలా మందిలో ఆ భయం ఎక్కడా కనిపించటం లేదు.

అవగాహన ఎటు పోతోంది? 
ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టీవీ న్యూస్‌ చానల్‌ పెట్టినా కరోనాకు సంబంధించిన వార్తలే ప్రసారమ వుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లలో కూడా ప్రముఖుల సందేశాలు ప్రసారమవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉండి రోజుకు సగటున 600 మందికి పైగా చనిపోతున్న ఇటలీ, స్పెయిన్‌ దేశాలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికి మించి వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో భయం పుట్టించే తరహాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవటం గమ నార్హం. సాధారణంగా ఆంక్షలు విధించినప్పుడు భయంతో అమలు చేయటం కద్దు.. కానీ, కరోనాలాంటి భయంకర వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా.. జాగ్రత్తలు పాటించకపోవటం విచిత్రం.

పోలీసులున్నప్పుడు జాగ్రత్తగా.. 
ప్రజలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు. వారున్న సమయంలో మాత్రం దుకాణాల ముందు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లు మొదలు చిన్నచిన్న కూరగాయల బండ్ల వరకు పోలీసులు కనీసం ఒక మీటర్‌ దూరం చొప్పున చాక్‌పీసులతో రోడ్లపై వృత్తాకారంలో గీతలు గీయించారు. వాటిల్లో ఒకరి తర్వాత ఒకరు నిలబడాలని ఆదేశించారు. పోలీసులున్న సమయంలో అలాగే ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోగానే గుంపులుగా పోగవుతు న్నారు. కొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం తగిన సూచనలు చేస్తుండటంతో వాటి ముందు పోలీసులు చెప్పినట్టుగా ఉంటున్నారు. మిగతావాటి ముందు యజమానులు పట్టించుకోకపోతుండటంతో షరామామూలుగానే ఉంటోంది.

కూరగాయల మార్కెట్లలో దారుణం 
హైదరాబాద్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు అమలు కావటం లేదు. ఒక్కో దుకాణం వద్ద పదుల సంఖ్యలో గుమికూడుతున్నారు.  ప్రస్తు తం రాష్ట్రంలో ఎక్కడా కూరగాయలకు కొరత లేదు. అయినా జనం మార్కెట్లకు ఎగబడుతున్నారు.

కఠిన ఆంక్షలు అవసరం 
కూరగాయల మార్కెట్ల వద్ద వలంటీర్లనో, పోలీసు లనో ఉండేలా చేస్తే తప్ప తీరు మారే సూచనలు కనిపించటం లేదు. ఎక్కడైనా జనం గుమికూడితే చర్యలు తీసుకుంటామనో, యజమానులపై కఠినం గా వ్యవహరిస్తామనో... హెచ్చరిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల సిబ్బంది ఇళ్లకే పరిమిత మైనందున అటువంటి వారి సేవలను ఇందుకు వినియోగించాలని, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బం ది లేకుండా డ్రెస్సులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్‌లు ఇచ్చి, ప్రత్యేక గౌరవ వేతనం చెల్లిస్తూ వినియోగించుకోవాలన్న సూచనలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు