ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్‌

26 Jul, 2018 10:40 IST|Sakshi

హైదరాబాద్‌: కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగులు  చూసే మేనేజెంట్లు లేవని మండిపడ్డారు. ఫీజు కట్టలేదని యాజమాన్యం, స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి రెండింటి మధ్య పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు యాజమాన్యాలకు వంత పాడుతున్నారని ఆరోపించారు.

 యాజమాన్యాల దగ్గర పోలీసులు డబ్బులు దండుకుని..కేసులను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండటం లేదని, ఇందులో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వం, స్కూళ్లల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా  చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఫీజులు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

కవాడీగూడ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నపరిస్థితి నెలకొందని వెల్లడించారు. నగరంలో జరిగేది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ మంత్రి ఇచ్చే నివేదిక మరోలా ఉందని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలు  అరికట్టకపోతే పేరెంట్స్ అసోసియేషన్ తరుపున రాబోయే రోజున మరింత ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు