కోరలు చాస్తున్న డెంగీ

14 Jun, 2019 08:55 IST|Sakshi
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

సాక్షి, ఆదిలాబాద్‌: డెంగీ అప్పుడే కోరలు చా స్తోంది. గతేడాది జిల్లాను వణికించిన ఈ వ్యాధి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాలను హైరిస్క్‌గా గుర్తించగా..ఇందులో ఆదిలాబాద్‌ జిల్లా కూడా ఉంది. ప్రధానంగా దీని చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతో రోగం పేరెత్తితేనే సామాన్యుల్లో వణుకు పుడుతోంది. దీనికితోడు వ్యాధికి గురైన రోగి కొద్ది నెలల పాటు కోలుకోలేని పరిస్థితి ఉండడం ఇబ్బందిగా మారుతోంది.

దోమ చెలగాటం..
దోమ చెలగాటం.. మనిషికి డెంగీ సంకటం అన్న రీతిలో ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభిస్తుంది. ఆర్థో వైరస్‌లో వ్యాప్తి చెంది ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. ఎడిస్‌ ఎజిప్టే అనే దోమ కుట్టడం వలన డెంగీ వస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగిని కుట్టి మరో వ్యక్తిని ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఏడాదికేడాది డెంగీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్‌ లేని  సమయంలో కూడా పాజిటీవ్‌ కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తుంది. ఆదిలా బాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం రిమ్స్‌ వైద్యుడు డెంగీ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపింది. ప్రాణా లు కాపాడే వైద్యునికే ప్రాణ రక్షణ లేని పరిస్థితులు రిమ్స్‌ వైద్య కళాశాలలో ప్రస్పుటం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపడితేనే రోగుల ప్రాణాలకు రక్షణ కలగనుంది.

ఒకవైపు సీజనల్‌ వ్యాధులు..
వర్షాకాలంలో ఒకవైపు సీజనల్‌ వ్యాధులతో జనాలు సతమతం అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. డయేరియా (నీళ్ల విరేచనాలు), మలేరియా, చికున్‌గున్యా, యెల్లోఫీవర్‌ వంటి వ్యాధులు మనుషులను చుట్టుముడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా పాజిటీవ్‌ కేసులు అధికంగా నమోదవుతాయి. గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అయితే గిరిజనులు ఈ తెరలను ఉపయోగించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన కలిగించేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టనుంది.

సమన్వయం అవసరం..
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రధానంగా పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్స్య శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యాంటీ లార్వ ఆపరేషన్‌ చేపట్టడం ద్వారా దోమలను నివారించాలని యోచిస్తుంది. ప్రధానంగా చీకటి ప్రదేశాల్లో, నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. జిల్లా నుంచి అధికారులు పాల్గొననున్నారు. జిల్లా పరిస్థితులకు సంబంధించి నివేదిక రూపొందించి మంత్రికి అందజేయనున్నారు. 

సీజన్‌లో అప్రమత్తంగా ఉంటాం
సీజన్‌లో అప్రమత్తంగా ఉంటాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జిల్లా ప రిస్థితులను నివేదిస్తాం. డీఎంహెచ్‌ఓ పరిధిలో 52 వైద్యుల పోస్టులకు గాను 48 పొజిషన్‌లో ఉండగా, నా లుగు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చే సేందుకు చర్యలు తీసుకుంటాం. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం.  – డాక్టర్‌ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌ఓ 

మరిన్ని వార్తలు