కేసీఆర్‌కూ తెలుసు: డీకే అరుణ

3 Oct, 2018 09:55 IST|Sakshi
మాజీ మంత్రి డీకే అరుణ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారు. ఏ ఒక్క పనిని నీతి, నిజాయితీతో చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా వంచించారు. కాంగ్రెస్‌ హయాంలో 90శాతం పూర్తయిన ప్రాజెక్టులకు మిగతా పది శాతం నిధులను కేటాయించలేని దద్ధమ్మ ప్రభుత్వం కేసీఆర్‌ది. కమీషన్లకు కక్కుర్తిపడి చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత లేమి కారణంగా ఎక్కడిక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయి.

రోడ్లను ఎక్కడిక్కడ తవ్వేసి ధ్వంసం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదు. ప్రతీ పనిలోనూ పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరిపాలన చేత కాకపోవడంతోనే మధ్యలో పారిపోయారు. పరిపాలన చేత కాక, తాగునీళ్లు అందించలేని టీఆర్‌ఎస్‌ నేతలకు ఓట్లడిగే హక్కు ఎక్కడిది’ అని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పాలమూరు ప్రాంతంలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలను ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
 
కేసీఆర్‌కు కూడా తెలుసు... 
రాబోయే ఎన్నికలు మంచి – చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం. ప్రజలెప్పుడూ ధర్మం, న్యాయం వైపే నిలుస్తారు. ఆ నమ్మకం ఉన్నందునే చెబుతున్నా... ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్నీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోబోతుంది. ఈ విషయం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కూడా తెలుసు. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన పాలమూరు జనం నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్‌ చేయించిన సర్వేలన్నింటల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీనే బలంగా ఉందని, ముఖ్యంగా పాలమూరులో హస్తం స్వీప్‌ చేయబోతుందని తేలింది. మేం చేయించిన సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమైంది. టీఆర్‌ఎస్‌ అరాచకాలకు భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికే ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేశారు. ఒక్క విషయం చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ కేడరే ఆ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రజలంతా పార్టీలకతీతంగా కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నాం.
  
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు 

టీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. దాని యజమాని కేసీఆర్‌ నోటి నుంచి ఒక్క నిజం కూడా రాదు. రకరకాల మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండదు. దళితుల మూడెకరాల భూమి, మైనార్టీలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, బోయలను ఎస్టీలలో చేర్చడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటింటికీ తాగునీరు... ఇలా చెప్పుకుంటూ పోతే గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. దీంతో కేసీఆర్‌ మీద కసి తీర్చుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని వాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
  
పాలమూరుకు చేసిందేమీ లేదు... 
ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమని నమ్మించాలనే ‘గోబెల్స్‌’ ప్రచారంతో కేసీఆర్‌ కుటుంబం ఆరితేరింది. పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయకపోయినా... అది చేశాం, ఇది చేశామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. వాళ్ల ఘనత ఏమిటనేది ఇక్కడి ప్రజలకు తెలుసు కాబట్టే.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పాలమూరు గురించి చెబుతున్నరు. వారిని సూటిగా అడగదలుచుకున్నా... పాలమూరుకు మీరు ఒరగబెట్టిందేమిటో గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టుల పనులను 90శాతం పూర్తి చేశాం.

కావాలంటే ఏయే ప్రాజెక్టులపై ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారు.. ఏ మేర పనులు జరిగాయేది అధికారులను అడగండి. ఇది వరకే పలుమార్లు ప్రాజెక్టులకు ఎవరి హయాంలోనే నిధులు ఖర్చు చేసిందనేది బయటపెట్టాం. పెండింగ్‌లో ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయడానికి టీఆర్‌ఎస్‌ నాయకులకు చేతకాలేదు. కుర్చీ వేసుకుని మరీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తానని సీఎం హోదాలో చెప్పిన మాటను కేసీఆర్‌ తప్పిండు. మూడున్నరేళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి పనులు పది శాతం పూర్తికాలేదు.
  
రైతులకు అండగా నిలవడం తప్పా? 
ప్రాజెక్టుల మీద కాంగ్రెస్‌ నేతలు కేసులు వేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎందుకు కేసు వేశారు.. మీరు చెప్పిందేమిటి.. చేస్తున్నదేంటి? ప్రాజెక్టుల వల్ల సర్వం కోల్పోతున్న వారికి నష్టపరిహారం అడగటం తప్పా? అవును... పవన్‌కుమార్‌ కేసు వేసింది రైతుల పక్షాన మాత్రమే. దేవరకద్ర నియోజకవర్గంలోని కర్వెన రిజర్వాయర్‌ ద్వారా స్థానిక రైతులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. రైతులకు సరైన నష్టపరిహారం అందలేదు. ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం హోదాలో కేసీఆర్‌ ఇచ్చిన మాటను తప్పాడు. కర్వెన నిర్వాసిత రైతులు జోలే పట్టుకొని భిక్షాటన చేశారు.

అందుకే రైతులకు న్యాయం కోసమే పవన్‌కుమార్‌ కోర్టు మెట్లెక్కాడు. ప్రాజెక్టు పనులు మొదలయ్యేలోపే ముంపు బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మాట తప్పలేదా? దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడరు. ఇక్కడ మరో విషయం గుర్తించాలి. ప్రభుత్వం సరైన విధానంలో వెళ్తుంటే.. న్యాయస్థానాలు ఎందుకు చీవాట్లు పెడుతుంది. పరిపాలన చేతకాక అన్నీ అడ్డదిడ్డమైన నిర్ణయాలతో ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారు.
  
16 తాగునీటి పథకాలు 
మిషన్‌ భగీరథ కేవలం వాళ్ల కమీషన్ల కోసం తీసుకొచ్చిన పథకమే తప్ప... ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఈ పథకం కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడం కోసం తీసుకొచ్చిందే తప్ప మరేమీ లేదు. చాలా వరకు నాసిరకం పైపుల కారణంగా ఎక్కడిక్కడ ట్రయల్‌ రన్‌లోనే లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఒకవేళ షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలోస్తే మిషన్‌ భగీరథలో లోపాలన్నీ భయటపడుతాయని ఆయనకు భయం పట్టుకుంది. నీళ్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమని చెప్పిన నోటితో ఇప్పుడు ఓట్లు ఎట్లా అడుగుతారు. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో 16 తాగునీటి పథకాల ద్వారా ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. ఉన్న తాగునీటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయారు. తాగునీటి స్కీంల్లో పనిచేసే వారికి కూడా నెల నెల వేతనాలు అందివ్వలేని చేతకాని ప్రభుత్వం... మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నీళ్లు ఇస్తారంటే ఎవరూ నమ్మలేరు.   

ఉమ్మడిగా ముందుకెళ్తాం.. 
ప్రజలకు పట్టిన టీఆర్‌ఎస్‌ పీడను విరగడ చేయడానికి ఎన్నికల్లో సమిష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. అందుకు అనుగుణంగా కలిసొచ్చే పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ముందుకు సాగుతుంది. ఒకటి, రెండు రోజుల్లో సీట్ల పంపకాల వంటి అంశాలు కొలిక్కి వస్తాయి. పార్టీల బలాబలాలను అంచనా వేసుకొని సీట్ల సర్దుబాటు చేస్తున్నాం. ఏయే నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారనేది సర్వే కూడా చేయించాం. దీనికి అనుగుణంగా పార్టీలకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రకటిస్తాం. ప్రస్తుతానికి అభ్యర్థుల ప్రకటన లేకపోయినా... ఎవరికి అనుకూలంగా ఉన్న చోట్ల వారు ప్రచారం కూడా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు