బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌.. ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

20 Dec, 2019 12:37 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల బస్‌ డిపో ఎదుట శుక్రవారం ఉదయం ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అధికారులు పనిచేయని బ్రీత్ ఎనలైజర్‌తో తమకు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా తమను విధులకు దూరం పెట్టి వేదింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ వెళ్లాల్సిన రాజధాని బస్సు డ్రైవర్‌ రాజుకు ఆర్టీసీ అధికారులు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ నిర్వహించగా.. మిషీన్‌ 53 పాయింట్లు చూపెట్టింది. మద్యం తాగే అలవాటు లేకపోయినా బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లో తను మద్యం తాగినట్టు రావడంతో రాజు అవాక్కయ్యారు. 

దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు.. రాజుకు తమ వద్ద ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌తో టెస్ట్‌ నిర్వహించగా.. ఆ మెషీన్‌లో జీరో పాయింట్స్‌ కనిపించాయి. కాగా, రెండు రోజుల క్రితం కూడా మరో డ్రైవర్‌కు ఆర్టీసీ బ్రీత్‌ ఎనలైజర్‌తో టెస్ట్‌ నిర్వహించగా 274 పాయింట్లు చూపించింది. దీంతో ఆగ్రహానికి లోనైనా డ్రైవర్లు.. పనిచేయని ఆర్టీసీ బ్రీత్‌ ఎనలైజర్‌ను తొలగించి.. తమ పనులను సక్రమంగా చేసుకునేలా చూడాలని డిమాండ్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు