ఆర్థిక వ్యవస్థను కాపాడాం: ప్రధాని మోదీ

20 Dec, 2019 12:31 IST|Sakshi
అసోచామ్‌ వందేళ్ల ఉత్సవాల్లో ప్రధాని మోదీ

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీవైపు అడుగులు

సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వృద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వృద్ధికి అన్నిరకాలుగా కృషి చేశామని మోదీ వెల్లడించారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్‌ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు.  

రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్‌టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగుపడిందని మోదీ తెలిపారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకోసం  ఆధునిక, వేగవంతమైన డిజిటల్‌ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం  గమనార్హం. 

>
మరిన్ని వార్తలు