పంచాయతీలకు నిధులు మంజూరు

6 Nov, 2014 03:08 IST|Sakshi

ఇందూరు :  దీర్ఘకాలికంగా పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరయ్యాయి. పారిశుధ్య సమస్య పరిష్కారం, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు పల్లె ప్రజల చిన్న చిన్న సమస్యలను తీర్చడానికి 2014-15 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7.38 కోట్లు మంజురు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు.

 జిల్లా ట్రెజరీ శాఖ ద్వారా ఈ నిధులను అలాట్ చేసి బ్యాంకు ఖాతాల్లో వేయడానికి పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే పంచాయతీ ఖాతాల్లో నిధులు పడనున్నాయి. ఈ నిధులతో పంచాయతీల్లో సానిటేషన్ పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాలు, అంగన్‌వాడీలు, పాఠశాలల్లో మరుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు.

 జడ్పీకి రూ. 2 కోట్లు..
 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 2014-15 సంవత్సరానికిగాను జిల్లా పరిషత్‌కు రూ. 2 కోట్లు మంజురయ్యాయి. మొత్తం రూ. 23 కోట్లు జిల్లాకు రావాల్సి ఉండగా మొదటి దశగా రూ. 2 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మండల పరిషత్‌లకు కోటి రూపాయల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులను కూడా ట్రెజరీ ద్వారా జిల్లా, మండల పరిషత్‌లకు కేటాయించనున్నారు.

ఈ నిధులను జిల్లాలోని 718 పంచాయతీల ఖాతాల్లో వేయడానికి వీలుగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ మూడు డివిజన్ పంచాయతీ కార్యాలయాల వారిగా పంచాయతీలను విభజించి, అందులో పంచాయతీల జనాభా ఆధారంగా నిధులను కేటాయిస్తున్నారు.

మరిన్ని వార్తలు