ఆగస్టు 1 నుంచి హజ్‌యాత్ర 

8 Jun, 2018 02:42 IST|Sakshi

షెడ్యూల్‌ విడుదల చేసిన హజ్‌ కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: హజ్‌యాత్ర–2018 షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి ప్రయాణం ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ మసీవుల్లాఖాన్‌ తెలిపారు. బుధవారం ఉమ్రాయాత్ర ముగించుకొని నగరానికి చేరుకున్నారు. గురువారం తన కార్యాలయంలో 2018 హజ్‌యాత్ర షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హజ్‌కమిటీ ఎంపిక చేసినవారు ఆగస్టు 1 నుంచి 16వ తేదీ వరకు హజ్‌యాత్రకు వెళతారన్నారు.

ఈ ఏడాది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు యాత్రికులు రాష్ట్ర హజ్‌ కమిటీ ద్వారా వెళ్లనున్నట్లు తెలిపారు. మొత్తం 16 విమానాల ద్వారా దాదాపు 6 వేల మంది యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హజ్‌ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అజీజియా, రుబాత్‌ కేటగిరీ వారికి వంట చేసుకునే సౌకర్యం ఉందని, గ్రీన్‌ కేటగిరీ వారికి ఈ సౌకర్యం లేదని పేర్కొన్నారు. రూ.రెండు వేలు అదనంగా వసూలు చేస్తుండడంతో రాష్ట్ర యాత్రికులకు భారమవుతోందని, ఈ విషయమై పునరాలోచించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. యాత్రకు వెళ్లే ముందే యాత్రికులకు సిమ్‌కార్డులు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. 
 

మరిన్ని వార్తలు