జహీరాబాద్: ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఎన్నికల స్టంటే అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో విలేకరులతో మాట్లా డారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్లు దండుకునేందుకే రైతుబంధు, ఉద్యోగాల ఆశ చూపే ప్రయ త్నం చేస్తున్నారన్నారు.
నాలుగేళ్ల నుంచి రైతుబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతుబంధును పేద కౌలు రైతులకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఈ పథకం దొరలు, విదేశాల్లో ఉన్న భూస్వాములకే ఉపయోగపడుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదనల కంటే రెట్టింపు నిధులు పెంచారని విమర్శించారు.
గవర్నర్ ఇఫ్తార్ విందుకు దూరం
ఈ నెల 10న గవర్నర్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు తాను వెళ్లడం లేదని షబ్బీర్ అలీ వెల్లడించారు. రాష్ట్రపతి భవన్లో ఆనవాయితీగా ఇస్తున్న ఇఫ్తార్ విందు, క్రిస్మస్ వేడుకలను ఇక నుంచి నిర్వహించకూడదని రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నందున తాను గవర్నర్ ఇచ్చే విందుకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ వాది అయినందున సంఘ్ ఎజెండాను అనుసరిస్తున్నారన్నారు. ఇప్పటికే హజ్ యాత్ర సబ్సిడీని సైతం ఎత్తివేశారని గుర్తు చేశారు. రైతు బంధు పథకం కింద తనకు రూ.1.28 లక్షలు వచ్చాయని, ఈ డబ్బు ను ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.