ఆన్‌లైన్‌లోనూ.. సైకతం

11 Dec, 2019 09:13 IST|Sakshi

 జియో ట్యాగింగ్‌తో ఇసుక తరలింపుపై నిఘా

సత్ఫలితాలనిస్తున్న ‘మన ఇసుక వాహనం’

గ్రామ పంచాయతీలకు పెరిగిన ఆదాయం

ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. ఆన్‌లైన్‌లో అనేకం దొరుకుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు తాజాగా ఇసుక వ్యాపారం కూడా సై..అంటూ దూసుకొచ్చింది. మీకూ కావాలా? చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. అందులో ఆర్డరిస్టే.. ఎంచక్కా ట్రాక్టర్‌ లోడు మీ ఇంటికే వస్తుంది. ఆ తర్వాతే డబ్బులివ్వండి. ఈ వాహనం బయల్దేరినప్పటి నుంచి లోడు దించే వరకు కదలికలను అధికారులు గుర్తిస్తారు. అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తారు.

సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ప్రాంతాల్లో మన ఇసుక వాహనంతో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ద్వారా సైకతం (ఇసుక) సరఫరాకు ప్రభుత్వం అనుమతించింది. ప్రసుత్తం 6 ప్రాంతాల నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మన ఇసుక వాహనం పేరిట..జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేయడంతో..ఈ బండి ఇసుక రీచ్‌ నుంచి బయల్దేరాక ఎక్కడ ఉంది? ఎటు వెళ్తుంది? అనేది అధికారులకు తెలుస్తుంది. బుక్‌ చేసుకున్న వినియోగదారుడి ఇంటికి వెళ్లి లోడ్‌ దించాక..తనకు ఇసుక అందిందని ఆన్‌లైన్‌లో సమాచారమిస్తేనే ఆ ట్రాక్టర్‌కు కిరాయి వస్తుంది.

ఇసుకను తరలించే ట్రాక్టర్‌కు కిలోమీటరుకు రూ.80 చొప్పున ప్రభుత్వం కిరాయి అందిస్తుంది. స్యాండ్‌ ర్యాంపు నుంచి 50, 60 కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా చేసుకునే వీలుంది. ప్రతిరోజూ ఒక్కో ట్రాక్టర్‌కు అన్నిఖర్చులు పోనూ రూ.3వేల వరకు ఆదాయం వస్తుంది. ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక్కో ట్రిప్పుకు రూ.300 వస్తాయి. మరమ్మతులకు ట్రిప్పుకు రూ.100 కేటాయిస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు స్థానికంగా ఉన్న కూలీలకు కూడా ఉపాధి లభిస్తోంది. ఆన్‌లైన్‌ ప్రక్రియతో అక్రమాలు చోటు చేసుకోకుండా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. 18,091ట్రిప్పులు బుక్‌ కావడంతో మరికొన్ని పంచాయతీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. 


‘మన ఇసుక’ వాహనం రావాలంటే హెల్ప్‌డెస్క్‌ నంబర్లు ఇవే..

మరిన్ని వార్తలు