లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియాకు చెందిన వారే

7 May, 2019 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేరళ రాష్టానికి పశ్చిమ దిశగా ఉన్న లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారేనని హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీతో (సీసీఎంబీ) పాటు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి విస్తరించే క్రమంలో భారత పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించినట్లు ఇప్పటికే తెలిసినప్పటికీ ఈ మార్గంలో లక్షదీవులు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టం. అంతేకాకుండా ఈ 36 ద్వీప సముదాయంలో మానవ ఆవాసం ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు.

ఈ నేపథ్యంలో సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త తంగరాజ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ దీవుల్లోని ప్రజలపై కొన్ని జన్యు పరిశోధనలు చేపట్టారు. 8 దీవుల్లోని 557 మంది మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ, 166 మంది క్రోమోజోమ్‌లను పరిశీలించారు. ఈ వివరాలను విశ్లేషణ చేసినప్పుడు జన్యు వైవిధ్యత తక్కువని స్పష్టమైంది. కాలక్రమంలో ఈ ప్రాంతాలను పలువురు రాజులు పాలించినా తక్కువ జన్యు వైవిధ్యత ఉండటం తమను ఆశ్చర్య పరిచిందని బెనారస్‌ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. 

మరిన్ని వార్తలు