అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్‌

1 Aug, 2019 02:49 IST|Sakshi

అభినందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పీసీసీఎఫ్‌గా పదవీ విరమణ చేసిన పీకే ఝా

వీడ్కోలు సభలో పాల్గొన్న సీఎస్‌ జోషి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌కుమార్‌ ఝా ఎంతో కృషి చేశారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రశంసించారు. ఝా పదవీ విరమణ సందర్భంగా బుధవారం అరణ్యభవన్‌లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్, సీఎస్‌ ఎస్కే జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీకే ఝాకు మంత్రి, సీఎస్, ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కొత్త పీసీసీఎఫ్‌(ఇన్‌చార్జ్‌) ఆర్‌.శోభకు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లకుపైగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి హోదాలో పనిచేసిన అతి కొద్ది మం ది ఐఎఫ్‌ఎస్‌లలో ఝా ఒకరని అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతోసహా అనేక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు రికార్డు వేగంతో సాధించేలా తన బృందంతో కలిసి కృషి చేశారని చెప్పారు. హరితహారం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించారన్నారు. పీకే ఝా సేవల వల్ల అటవీ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇదేస్ఫూర్తితో హరితహారం, అటవీరక్షణకు అటవీ అధికారులు కృషి కొనసాగించాలని సూచించారు. ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని సీఎస్‌ ఎస్‌కే జోషి అన్నారు.రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూముల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసిం చారు. పీకే ఝా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారం వల్లే తాను విజయవంతంగా పనిచేయగలిగానని, çసహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ పృథ్వీరాజ్, అడిషనల్‌ పీసీసీఎఫ్‌లు మునీంద్ర, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఫర్గేన్‌ లోకేష్‌ జైస్వాల్, సీఎఫ్‌వోలు, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు