మునగాల మండలంలో జానకీరామ్‌..

30 Aug, 2018 12:14 IST|Sakshi
జానకీరామ్‌ మృతదేహం (ఫైల్‌) 

మునగాల (కోదాడ) : 2014డిసెంబర్‌ 6వ తేదీన 65వ నంబర్‌ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో సాయంత్రం 6.45గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి జానకీరామ్‌(38) దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌ నుంచి తన సొంత కారు (టాటా సఫారీ ఈఎక్స్, ఏపీ 29 బీడీ-2323)లో విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నాలు గేళ్ల క్రితం ఈ ప్రమాదం సంభవించింది.

ఆకుపాముల వద్ద వరినారుతో వస్తున్న ఓట్రాక్టర్‌(ట్రాలీ) రాంగ్‌రూట్‌లో రోడ్డును క్రాస్‌ చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా వస్తున్న జానకీరామ్‌ కారు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా ట్రాలీ ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న జానకీరామ్‌ తీవ్రంగా గాయపడ్డారు. జానకీరామ్‌ను ముందుగా ఎవరూ గుర్తించలేదు.

ప్రమాద సంఘటన తెలుసుకున్న పలువురు గ్రామస్తులు జానకీరామ్‌ సెల్‌ఫోన్‌ ద్వారా డైల్డ్‌కాల్‌కు రింగ్‌ చేయగా అవతల వైపు నుంచి హరికృష్ణ ఫోన్‌ ఎత్తడంలో ప్రమాదం జరిగిన వ్యక్తి జానకీరామ్‌గా గ్రహించారు. గాయపడ్డ జానకీరామ్‌ను గ్రామస్తులు 108లో కోదాడలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జానకీరామ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు.

అతివేగమే ప్రమాదానికి కారణం

ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నాడు గుర్తించారు. దీనికి తోడు రహదారిపై వరినారుతో ఉన్నట్రాక్టర్, ట్రాలీ రాంగ్‌రూట్‌లో రోడ్డును క్రాస్‌ చేయడం మరొక కారణం. ఈ ప్రాంతంలో ఉన్న క్రాసింగ్‌ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

మరిన్ని వార్తలు