కలగా మారిన కంటి వెలుగు

9 Nov, 2018 11:55 IST|Sakshi

  కంటి వెలుగు ప్రారంభమై మూడు నెలలు 

   జిల్లాలో లక్షా 92 వేల మందిని పరీక్షించిన వైద్యులు 

  17,370 మందికి ఆపరేషన్లు   అవసరమని గుర్తింపు

  శస్త్రచికిత్సలపై రాని స్పష్టత

ఎల్లారెడ్డిరూరల్‌: కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆపరేషన్లు నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత కూడా లేదు. దీంతో ఆపరేషన్లు అవసరమైనవారు నిరాశ చెందుతున్నారు.  ఆగస్టు 15వ తేదీన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం జిల్లాలో కంటి వెలుగు అమలు కోసం 22 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక సాధారణ వైద్యుడు, ఒక ఆప్తాల్మిక్‌ వైద్యు డు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ ఉన్నారు.

ఇప్పటి వరకు జిల్లా లో 253 గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా లక్షా 92 వేల 892 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దగ్గరి చూపు లోపంతో బాధపడుతున్న 34,699 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. దూరపు చూపు లోపంతో ఉన్న 23,798 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్‌ చేశారు. 17,370 మంది మోతి బిందుతో బాధపడుతున్నారని గుర్తించిన వైద్యులు.. కంటి ఆపరేషన్ల కోసం సిఫారసు చేశారు.  
ప్రారంభం కాని ఆపరేషన్లు.. 

జిల్లాలో కంటి వెలుగు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్లు నిర్వహించలేదు. జిల్లాలో 17,370 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా ఒక్కరికి కూడా నిర్వహించకపోవడంపై కంటి చూపుతో బాదపడుతున్న వారు ఆవేదన చెందుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి రెండున్నర నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లలో జాప్యం జరుగుతుండడంపై నిరాశ చెందుతున్నారు. వెంటనే శస్త్రచికిత్సల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.

ఆపరేషన్లు ప్రారంభం కాలేదు.. 
జిల్లాలో కంటి వెలుగు కొనసాగుతోంది. ఇప్పటివరకు మోతిబిందు కారణంతో కంటి చూపుతో బాధపడుతున్న వారిని 17,370 మందిని గుర్తించాం. అయితే కంటి వెలుగు పథకం కింద ఇప్పటివరకు ఆపరేషన్లు ప్రారంభించలేదు. నేషనల్‌ బ్లైండ్‌నెస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తరువాత కంటి వెలుగులో ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి  

మరిన్ని వార్తలు