గ్రేటర్‌ దిగ్బంధం

7 May, 2020 01:39 IST|Sakshi

కోవిడ్‌–19 నియంత్రణపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం 

బయటకు వెళ్లకుండా, లోనికి రాకుండా చర్యలు తీసుకోండి

కర్నూలు, గుంటూరు సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండండి

ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరపాలి

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను చుట్టుముట్టి దిగ్బంధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నగరం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం చురుకైన పోలీసు, వైద్యారోగ్య, ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని, వైరస్‌ను తుదముట్టించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అమలు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు కర్నూలుకు, గుంటూరుకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

‘హైదరాబాద్‌ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. కనుక అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరికి పాజిటివ్‌గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలి. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్‌ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి’ అని ఆదేశించారు. చదవండి: తెలంగాణలోనూ సరి బేసి విధానం! 

సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండండి
‘ఏపీలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లో తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్‌ ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందే. కనుక ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు’అని సీఎం చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌ నర్సింగ్‌రావు, రామకృష్ణారావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చదవండి: తెలంగాణలో మద్యం జాతర 

>
మరిన్ని వార్తలు