ఆల్మట్టికి కృష్ణమ్మ పరవళ్లు! 

15 Jul, 2018 02:02 IST|Sakshi

  90 వేల క్యూసెక్కుల వరద 

  129 టీఎంసీలకుగానూ 83.78 టీఎంసీల నిల్వ 

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టిలోకి శనివారం ఉదయం 90,886 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, అది సాయంత్రానికి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో గత 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహముండగా, అది శనివారానికి 90 వేల క్యూసెక్కులకు చేరింది.

రోజుకు 9 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో వేగంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 129.72 టీఎంసీలకుగానూ 83.78 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర లో రెండ్రోజుల కిందటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం 76,527 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 100 టీఎంసీల నీరు నిల్వకుగానూ 66.02 టీఎంసీల నిల్వలున్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్టులో 37.64 టీఎంసీ ల నిల్వకుగాను 23.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్, తుంగభద్రలో మరో 50 టీఎంసీల మేర నిల్వలు చేరితే దిగువనున్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ వరదే మరిన్ని రోజులు కొనసాగితే 10 రోజుల్లోనే ఎగువ ప్రాజెక్టులు నిండి, దిగువకు నీటి ప్రవాహం మొదలయ్యే అవకాశముంది.  

ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు..  
ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా యి. ప్రస్తుతం రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర మాత్రమే నీరు రావడం, మరో 390 టీఎంసీ ల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో అవన్నీ ఎగువ ప్రవాహాలపైనే ఆధారపడ్డాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 20 టీఎంసీల నీరే ఉండగా, నాగార్జున సాగర్‌లో 312 టీఎంసీలకుగానూ లభ్యతగా ఉన్నది 133 టీఎంసీలు మాత్రమే. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వ ల్లో వినియోగార్హమైనది 10 టీఎంసీలకు మించి ఉండదు. జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 5.68 టీ ఎంసీ నీరు నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి.  

మరిన్ని వార్తలు