మంచం పట్టిస్తున్న మలేరియా

10 Jul, 2015 04:26 IST|Sakshi

పాల్వంచ : మలేరియా జ్వరాలు విజృభిస్తున్నాయి. ఇటీవల వర్షాలు పడి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వైరల్‌జ్వరాలతో విలవిలాడుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోజురోజుకు మలేరియా జ్వరపీడిత రోగులు పెరుగుతుండడం గమనార్హం. ఏరియా ఆస్పత్రి పరిధిలోని ములకలపల్లి మండలం నుంచి జ్వరపీడితులు ఎక్కువగా వస్తున్నారు. ఒక్కరోజే ములకలపల్లి మండలం వేమకుంట నుంచి వాడే మహేష్, గుగులోతు మహేష్, పుసుగూడెంకు చెందిన సడియం రమేష్, కమల, సీతారంపురానికి చెందిన కుర్సం రాజ మ్మ, కేసరి రామలక్ష్మి, రాంమూర్తి, సుబ్బనపల్లికి చెందిన సోడు భద్రమ్మ, చింతపాడుకు చెందిన మిడియం జోగమ్మ, నగేష్, పాల్వంచ మండలం కిన్నెరసానికి చెందిన మేకల నరేష్ తదిరులకు మలేరియా ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహిస్తున్నారు.

 బెడ్‌లు ఉన్నా అందించని వైద్యులు
 జ్వరాలబారిన పడిన వారికి ప్రత్యేకంగా అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ పుల్లయ్య పాల్వంచ ఏరియా ఆస్పత్రికి 30 పడకలను అందించారు. అయితే వీటిని ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతేగాక ఏరియా ఆస్పత్రికి సుమారు రూ.6 లక్షలతో ఎక్స్‌రే మిషన్ వచ్చి రెండు నెలలు గడుస్తున్నా వాటిని అందుబాటులోకి తెచ్చి వినియోగించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు