షార్ట్‌ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం 

16 Apr, 2018 02:14 IST|Sakshi

నిద్రలో ఉండగా ఘటన  

నారాయణపేట రూరల్‌: గాఢ నిద్రలో ఉండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గుజరాత్‌కు చెందిన నంజీలాల్‌ పటేల్‌ (62) కుటుంబం కొన్నేళ్ల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని యాద్గీల్‌ రోడ్‌లో నంజీలాల్‌ ఫ్లైవుడ్‌ షాపును ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. రోజులాగే శనివారం కూడా షాపులో నిద్రపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో గాఢనిద్రలో ఉన్న నంజీలాల్‌ స్పృహ తప్పి మంటల్లో కాలిపోయాడు.

తెల్లవారిన తర్వాత గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి దుకాణం తెరిచి చూడగా నంజీలాల్‌ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ఎస్సై వెల్లడించారు. నంజీలాల్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటం.. ఇంతలోనే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు

మరిన్ని వార్తలు