క్షతగాత్రుడిని తరలించిన ఎంపీ

19 Mar, 2019 08:06 IST|Sakshi
జిలానీ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ఎంపీ కవిత

డిచ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి ఎంపీ కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయం త్రం డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మారం(బి) గ్రామంలో కాకతీయ స్కూల్‌ బస్సు (నెంబరు ఏపీ 01 వీ 8683).. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న మహ్మద్‌ జిలానీ (ధర్మారం) స్కూల్‌ బస్సు టైర్‌ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామంలో గడ్డం ఆనంద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే కార్యక్రమానికి ఎంపీ కవిత, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, అకుల లలిత, పార్టీ నాయకులతో కలిసి వెళుతున్నారు.

రోడ్డు ప్రమాదం గమనించిన ఎంపీ కవిత తన వాహనం దిగి అంబులెన్స్‌కు ఫోన్‌ చేయడంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్‌ వైద్యులకు సమాచారం అందించారు. సమీపంలోనే ఉన్న జిలానీ కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని రోధించగా, ఎంపీ కవిత వారిని ఓదార్చారు. అంబులెన్స్‌ రాగానే క్షతగాత్రుడితో పాటు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి పంపించారు. మెరుగైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు ఫోన్‌లో సూచించారు. 

మరిన్ని వార్తలు