న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వండి

12 Aug, 2018 03:25 IST|Sakshi

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయ మూర్తుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉందని, దీంతో పౌరులకు సత్వర న్యాయం అందే పరిస్థితులు కనిపించటం లేవంటూ న్యాయవాది ఎస్‌.రాజ్‌కుమార్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించగా.. అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం  కలుగుతోందని వ్యాజ్యంలో పిటిషనర్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు