5న విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలి

1 Jul, 2018 12:08 IST|Sakshi
మాట్లాడుతున్న రంజిత్‌కుమార్‌ 

ఖమ్మంసహకారనగర్‌ : పాఠశాలల్లో, ఇంటర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూలై 5న నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు అన్ని వర్గాలవారు సహకరించి జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం గిరిప్రసాద్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం అని చెప్పిన ప్రభుత్వం వాటిని మూసి వేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. సరైన తరగతి గదులు లేకపోవడంతో పాటు కనీసం మరుగుదొడ్లు కూడా అనేక పాఠశాలల్లో లేవన్నారు. 

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇటికాల రామకృష్ణ, నాయకులు లక్ష్మణ్, గోపి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు