పెళ్లి చేయడం లేదన్న మనస్తాపంతో..

14 Feb, 2020 10:11 IST|Sakshi
నరేష్‌, (ఫైల్‌)

సాక్షి,  బాన్సువాడ : తల్లిదండ్రులు తన పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. పొతంగల్‌కు చెందిన నరేశ్‌(22) కొన్నేళ్లుగా బోర్లంలోని తన మేనమామ మద్ది బాలయ్య వద్ద ఉంటున్నాడు. నరేష్‌ కొంతకాలంగా తనకు పెళ్లి చేయాలని తన తల్లి విఠవ్వ, అన్న కిషన్‌పై ఒత్తిడి తెచ్చాడు. కొన్ని రోజులు ఓపిక పట్టమని వారు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన నరేశ్‌ నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు నరేశ్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. నాలుగు రోజుల పాటు అక్కడ చికిత్స అందించిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమించిందని మూత్ర పిండాలు, కాలేయం దిబ్బతిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలైన తల్లిదండ్రులు బుధవారం నరేశ్‌ను ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యం విషమించి గురువారం ఇంటి వద్ద నరేశ్‌ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

మరిన్ని వార్తలు