కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ!

11 Sep, 2018 03:29 IST|Sakshi

సన్నద్ధమవుతోన్న పోలీసు శాఖ

ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై నివేదిక రూపొందించనున్న డీజీపీ  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంతో సుదీర్ఘంగా భేటీ అయ్యేందుకు పోలీస్‌ శాఖ సన్నద్ధం అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందంతో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బుధవారం భేటీలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఎందుకు లేవు అన్న వివరాలపై పోలీస్‌ శాఖ నివేదిక సమర్పించనుంది. గతంలో సమస్యాత్మకంగా మారిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆరా తీయనుంది. దీంతో పోలీస్‌ శాఖ వివరాలను ఇంటెలిజెన్స్‌ నుంచి కేంద్రీకరించి రిపోర్ట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అన్ని జిల్లాల్లోని ఎస్పీలు, కమిషనర్ల నుంచి భద్రతా ఏర్పాట్లు, ఎంత మంది సిబ్బంది బందోబస్తు కోసం కావాల్సి ఉంటుందన్న వివరాలను నివేదిక రూపంలో అందించాలని పోలీస్‌ శాఖ ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం మూడేళ్ల నుంచి నాలుగేళ్ల పాటు ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది బదిలీలు పూర్తిచేయాలని, పూర్తిచేసిన జాబితాను సైతం అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు తెలిసింది.  

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ..
పోలింగ్‌ బూత్‌లకు రవాణా సౌకర్యం, ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉన్నతాధికారులు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించినట్లు తెలిసింది. గత సాధారణ ఎన్నికలో రాష్ట్రంలోని 45 వేల మంది పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల బందోబస్తులో నిమగ్నం చేశారు. అలాగే 150 పారామిలిటరీ బలగాలను భద్రతలో నిమగ్నం చేశారు. ఈసారి కూడా అదే రీతిలో ఎన్నికల భద్రత నిమిత్తం పోలీస్‌ సిబ్బంది, అందుకయ్యే బడ్జెట్‌ ప్రతిపాదనను సైతం పోలీస్‌ శాఖ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందించనున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు