విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..

31 Jul, 2019 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చార్మినార్‌ ఆయుర్వేద హాస్పిటల్‌ తరలింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. యునానీ వారే కావాలని హాస్పిటల్‌ను అక్కడి నుంచి ఎర్రగడ్డకు తరలిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా చార్మినార్‌ ఎదుట విద్యార్థులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను, లెక్చరర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. 

రెచ్చిపోయిన మానవమృగం..
ధర్నా చేస్తున్న విద్యార్థినిలను మహిళ పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకడమే కాకుండా.. గట్టిగా గిల్లాడు. దీంతో సదురు విద్యార్థిని నొప్పి భరించలేక గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఓ పోలీసు కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు