హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే 

6 Jan, 2020 18:40 IST|Sakshi

కఠినంగా శిక్షించాలి: స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 

‘హాజీపూర్‌’ కేసులో వాదనలు షురూ

సాక్షి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యలపై సోమవారం నల్లగొండ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు న్యాయమూర్తి సాక్షుల వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించి అతని ద్వారా సమాధానాలు రాబట్టిన విషయం తెలిసిందే. శ్రావణి కేసుకు సంబంధించి జిల్లా ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ఎదుట స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చంద్రశేఖర్‌ తన వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిది మొదటినుంచీ నేర చరిత్రేనని సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలతోపాటు డీఎన్‌ఏ రిపోర్టులు, వేలిముద్రలు, సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ బట్టి స్పష్టమవుతోందన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, మృతురాలి తల్లిదండ్రులు, ఇతరుల సాక్ష్యాలన్నీ పరిశీలిస్తే శ్రీనివాస్‌రెడ్డే హత్యలకు బాధ్యుడనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
 

డీఎన్‌ఏ టెస్టు ఆధారంగా మృతురాలి దుస్తులపై ఉన్న వీర్యం, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వీర్యంతో సరిపోలిందని, అదే విధంగా వేలిముద్రలు కూడా అతనివేనని తేలిందని అన్నారు. శ్రావణిని నమ్మించి తీసుకెళ్లి స్పృహ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు రిపోర్టుల ఆధారంగా తెలుస్తోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మూడు సెల్‌ నంబర్లు ఉన్నాయని, అవన్నీ ఇప్పటికీ అతని పేరు మీద, అతని ఫొటోతో ఆయా సెల్‌ కంపెనీల వద్ద ఉన్నాయని చెబుతూ.. వివరాలను కోర్టు ముందు ఉంచారు. అత్యాచారాలు, హత్యలు జరిగిన సందర్భంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ నంబర్ల సిగ్నల్స్‌ హాజీపూర్‌ సెల్‌టవర్‌ పరిధిలో ఉన్నాయని, ఆ కంపెనీల నుంచి సేకరించిన ఆధారాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్ర అని, ఇలాంటి వారు సమాజంలో ఉండడం మంచిది కాదని తన వాదనను వినిపించారు.
చదవండి: అంతా అబద్ధం సార్‌..

 

>
మరిన్ని వార్తలు