హలీం ఆగయా

23 Apr, 2019 06:50 IST|Sakshi

ప్రారంభమైన విక్రయాలు

సాక్షి సిటీబ్యూరో: రంజాన్‌కు ముందే నగరంలో హలీం విక్రయాలు ప్రారంభమయ్యాయి. పండుగకు ఇంకా 15రోజులు ఉండగా... అప్పుడే హోటళ్లలో ఘుమఘుమలాడించే హలీం రెడీ అవుతోంది. రారామ్మని.. హలీం ప్రియులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో హలీం విక్రయాలు జోరందుకున్నాయి. గత రెండేళ్లుగా రంజాన్‌ వేసవిలో వస్తోంది. హలీం తయారీలో గోధుమలు, మటన్, మసాల దినుసులు వాడతారు. అయితే వేసవి దృష్ట్యా మసాల దినుసులు తక్కువగా వాడుతున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. షబ్బే బరాత్‌ నుంచే సిటీలో హలీం అందుబాటులోకి వచ్చింది. రంజాన్‌ పూర్తయ్యే వరకు హలీం నోరూరించనుంది.

కపుల్‌ ప్యాక్, ఫ్రెండ్స్‌ ప్యాక్, పార్టీ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, స్పెషల్‌ హలీం ప్యాక్, చికెన్‌ 65 హలీం ప్యాక్‌లను అందుబాటు ధరల్లో అందజేస్తున్నామని ట్రిపుల్‌ ఫైవ్‌ హోటల్‌ నిర్వాహకులు అలీ రజా తెలిపారు. ‘ఇరానీలు నగరానికి హలీం పరిచయం చేశారు. వారిలో మా తాతగారు హజీ అబ్బాస్‌ హష్మి పాత్ర కీలకం. పాతబస్తీలోని మదీనా హోటల్‌లో మొదట హలీం తయారు చేసి రంజాన్‌లో విక్రయించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి రంజాన్‌లో హలీం తయారు చేస్తున్నాం. ఈసారి రంజాన్‌ వేసవిలో వస్తున్న దృష్ట్యా శరీరానికి చల్లదనాన్నిచ్చే గులాబీ రేకులతో పాట జైఫాల్, జోవోత్రి మసాలాలు వాడుతున్నామ’ని అలీ రజా చెప్పారు.  

మరిన్ని వార్తలు