బీజేపీ నేతపై దాడి

23 Apr, 2019 06:59 IST|Sakshi
గాయపడిన అరుణ్‌కుమార్‌

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్‌పై స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసిన నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భగత్‌సింగ్‌ కాలనీలో నివసించే అరుణ్‌కుమార్‌ ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అదే బస్తీకి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ మురళి నిర్లక్ష్యంగా దూసుకొస్తూ అతడిని ఢీకొట్టాడు. దీనిపై అరుణ్‌కుమార్‌ ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మురళి అరుణ్‌కుమార్‌పై దాడికి యత్నించడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు.

అదే బస్తీకి చెందిన తన స్నేహితుడు ఎలక్ట్రీషియన్‌ అభిలాష్‌కు ఫోన్‌ చేసి పిలిపించాడు. అక్కడికి వచ్చిన అభిలాష్‌ తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో అరుణ్‌కుమార్‌ మెడపై విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అరుణ్‌కుమార్‌ వారి నుంచి బయటపడేందుకు యత్నించినా మద్యం మత్తులో అభిలాష్‌ స్నేహితుడు మురళితో కలిసి అరుణ్‌కుమార్‌ను గట్టిగా పట్టుకుని దాడి చేయడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాత్రి నిందితులను అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అరుణ్‌పై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని స్నేహితుడు విష్ణుపై కూడా నిందితులిద్దరూ దాడి చేశారు.  

మరిన్ని వార్తలు