సమరానికి సన్నద్ధం

5 Mar, 2019 06:10 IST|Sakshi

రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాక

శక్తి కేంద్రాలు, బూత్‌ కమిటీ బాధ్యులతో

క్లస్టర్‌ స్థాయి సమావేశం

హాజరుకానున్న ఐదు ఎంపీ నియోజకవర్గాలపరిధిలోని శ్రేణులు

అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు అవకాశం

గెలుపే లక్ష్యంగా వ్యూహ రచనలు

నేడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రాక

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : సార్వత్రిక సమరానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. పోలింగ్‌ నిర్వహణలో ఎంతో కీలకమైన బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాల బాధ్యులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై నిస్తేజంలో ఉన్న ఆ పార్టీ శ్రేణులను పార్లమెంట్‌ ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా చర్యలు చేపట్టింది. పక్షం రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలుండటంతో ప్రత్యేక దృ ష్టి సారించింది.

ఇందులో భాగంగా క్లస్టర్‌ స్థాయి సమావేశాన్ని బుధవారం నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాలులో నిర్వహిస్తోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్న ఈ సమావేశానికి ఐదు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని బూత్‌ కమిటీ బాధ్యులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు పాల్గొంటారు. నిజామాబాద్‌తో పాటు, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని శ్రేణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు వేల మందిని సమావేశానికి తరలించేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.

 నిజామాబాద్‌ స్థానంపై గురి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఏ ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్లు దక్కలేదు. ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే తపనతో బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. పార్టీకి పట్టున్న నిజామాబాద్‌ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్‌ ఎన్నికలుండే అవకాశాలుండటంతో గెలు పే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్‌లో ఎంతో కీలకమైన బూత్‌ కమిటీ బాధ్యులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులతో సమావేశం అవడం ద్వారా గెలుపు దిశగా పయనించవచ్చనే ఉద్దేశంతో ఈ సమావేశాలను నిర్వహిస్తోంది.

సన్నాహక సమావేశాలు..

క్లస్టర్‌ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తుగా నిజామాబాద్‌లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించింది. నిజా మాబాద్‌ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల సన్నాహక సమావేశం ఆదివారం జరగగా, నిజామాబాద్‌ అర్బన్, బోధన్, ఆర్మూర్‌ నియోజకవర్గాల సమావేశం సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది.

నేడు నిజామాబాద్‌కు లక్ష్మణ్‌ రాక

అమిత్‌షా పర్యటనకు సంబంధించిన ఏ ర్పాట్లను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షులు లక్ష్మణ్‌ నేడు నిజామాబాద్‌కు రా నున్నారు. ఆయనతో పాటు పలువురు రా ష్ట్ర నాయకులు వస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు