వరి ధాన్యం ధర తగ్గినా ఫలితం సున్నా
బియ్యం ధరలు మాత్రం పైపైకే..
అడ్డంగా దోచేస్తున్న హోల్సేల్, రిటైల్ వ్యాపారులు
ఉత్పత్తి రెండింతలైనా రైతులు, వినియోగదారులకు ప్రయోజనం నిల్
ధరల నిర్ధారణను పట్టించుకోని అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల్లో బియ్యం ముఖ్యమైనవి. మన దగ్గర ప్రతి ఇంట్లో బియ్యంతో అన్నం వండాల్సిందే. బియ్యం లేకుండా వంట ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ అవసరాన్నే వ్యాపారులు చక్కగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. బియ్యానికి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని అధిక ధరలతో రూ.కోట్లు దండుకుంటున్నారు. మార్కెట్లో అధిక ఉత్పత్తులు ఉన్నా...రైతు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నా కూడా బియ్యం ధరలు తగ్గడం లేదు.
తెలంగాణలో ఈసారి వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అటు ప్రభుత్వ గోదాములు.. ఇటు మిల్లర్ల గోదాముల్లో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. మార్కెట్లో మాత్రం బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండేళ్లుగా వరి ధాన్యం ఉత్పత్తి రెండింతలు పెరిగినా.. ధరలు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని మిల్లులకూ ఖరీఫ్లో పండిన ధాన్యం భారీగా చేరింది. దీనిని బియ్యంగా మిల్లర్లు ప్రభుత్వానికి ఇస్తున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కొందరు మిల్లర్లు మాత్రం బియ్యాన్ని తమ గోదాముల్లో నిల్వచేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పంట రావడంతో బియ్యానికి మంచి రేటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే హోల్సేల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలతో వినియోగదారులను దోచేస్తున్నారు.
రెండింతలైన వరి ఉత్పత్తి
2017–18 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18.25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మార్కెట్కు వచ్చిందని, 2018–19 ఖరీఫ్లో 40.42 లక్షల మెట్రిక్ టన్నుల వరి మార్కెట్ ద్వారా కొనుగోలు జరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. హోల్సేల్ వ్యాపారులు మిల్లర్ల నుంచి క్వింటాల్ బియ్యాన్ని రూ. 2,600 నుంచి 3,000 మధ్యలో ధరకే కొనుగోలు చేస్తున్నారు. రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు మాత్రం క్వింటాల్కు 4,500 నుంచి 5000 రూపాయల వరకూ బియ్యం అమ్ముతున్నారు. అంటే వ్యాపారులు ఒక్కో కిలోకు దాదాపు 20–25 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో ఇంత మొత్తంలో బియ్యం వ్యాపారంపై లాభాలు ఉండేవి కావని మార్కెట్ వర్గాల అభిప్రాయం.
జీఎస్టీ మినహాయింపు ఇచ్చినా...
వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించడం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు 2016 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం బియ్యంపై ఉన్న 1 శాతం మార్కెట్ ఫీజును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వరి ధాన్యంపై మిల్లర్ల నుంచి కేవలం ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు మండిపోతున్నాయి. మిల్లర్ల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన హోల్సేల్ వ్యాపారులతో పాటు రిటైల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించడం లేదు. ఏకంగా రిటైల్ వ్యాపారులు కేజీ బియ్యాన్ని 18 నుంచి 20 రూపాయల లాభానికి అమ్ముకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో రిటైల్ వ్యాపారమే రోజుకు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేరకు జరుగుతోంది. ఇందులో వ్యాపారుల లాభం రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల మేర ఉంటోందని మార్కెట్ వర్గాల అంచనా.
అప్పటి ధరలే ఇప్పటికీ..
గత రెండు మూడేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు అంతగా జరగకపోవడంతో మార్కెట్కు తక్కువగా దాన్యం వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడి ధరలు రూ.5 నుంచి 10 పెంచారు. బియ్యం కొరత సమయంలో ధరలు ఎలా ఉండేవో.. వాటినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాధారణంగా బియ్యం ధరలు కిలోపై గరిష్టంగా 5 రూపాయల కంటే ఎక్కువ అమ్మేవారు కాదు. ఈ ఏడాది ఖరీఫ్లో అత్యధికంగా వరి ఉత్పత్తి పెరగడంతో బియ్యం ధరలు బాగా పడిపోయాయని వినియోగదారులకు భావించారు. కానీ అలా జరగడం లేదు. జీఎస్టీకి ముందు మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి ప్రభుత్వం 5 శాతం వ్యాట్ను వసూలు చేసింది. ప్రసుత్తం వ్యాట్ కూడా లేదు. ధర నిర్ధారణ విషయంలో మార్కెట్ అధికారులను ప్రశ్నించగా.. ధర నిర్ధారణ తమ పరిధిలోకి రాదని సమాధానం ఇస్తున్నారు.
నష్టపోతున్న రైతులు..వినియోగదారులు
వాస్తవానికి ఆరుగాలం కష్టపడి వరి పండించిన రైతులకు తక్కువ ధరే లభిస్తోంది. మరోవైపు వినియోగదారులు మార్కెట్లో అధిక ధర చెల్లించి బియ్యం కొంటున్నారు. మధ్యలో మాత్రం ఎలాంటి శ్రమకోర్చని బియ్యం వ్యాపారులు రూ.కోట్ల లాభం దండుకుంటున్నారు.