అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

9 Sep, 2017 03:12 IST|Sakshi
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
- వెనుక నుంచి కారును ఢీ...
పల్టీలు కొడుతూ వ్యక్తిపై పడ్డ బస్సు
 
నిర్మల్‌ రూరల్‌/సారంగాపూర్‌: నిర్మల్‌ జిల్లా రూరల్‌ మండలంలోని డ్యాంగాపూర్‌ సమీ పంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న సూపర్‌ డీలక్స్‌ బస్సు (టీఎస్‌ 01జెడ్‌ 0138) డ్యాంగాపూర్‌ సమీపంలోని ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ పాఠశాల ఎదురుగా రాగానే డ్రైవర్‌ మితిమీరిన వేగం, అజాగ్రత్త కారణంగా అదుపు తప్పింది. ఈ క్రమంలో సారంగా పూర్‌ మండలం కంకెటకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌కు చెందిన ఆగి ఉన్న కారును వెనుకవైపు నుంచి బస్సు  ఢీకొట్టింది. ఉపాధ్యాయులు ఓస నరేందర్, సంతోష్‌రాథోడ్‌ దూసుకొస్తున బస్సును గమనించి.. ముందు సీట్లలోకి దూకేశారు. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
 
గమనించి పరిగెత్తినా.. 
ఆదిలాబాద్‌ వైపు నుంచి నిర్మల్‌కు బైక్‌పై వస్తున్న గొట్టుముక్కల భరత్‌(45) బస్సు పల్టీలు కొట్టడం.. కారు ఢీకొట్టి తనవైపు దూసుకు వస్తుండగా గమనించి బైక్‌ను వదిలి రోడ్డు  పక్కకి పరుగెత్తాడు. అయినా.. బస్సు మూడో పల్టీ సరిగ్గా భరత్‌పైనే పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిలో 16 మందికి స్వల్పగాయాలు కాగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు అధికారులు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ ద్వారా బస్సును పైకిలేపి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆస్పత్రికి  మంత్రి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.
మరిన్ని వార్తలు