అవ్వా తాతలకు ‘ఆత్మియుడి’ అండ 

4 Oct, 2023 04:55 IST|Sakshi

రాష్ట్రంలో వయోవృద్ధులకు భరోసా ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

 41.05 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు 

ఆర్టీసీ బస్సుల్లో సీనియర్‌ సిటిజన్స్‌కి 25 శాతం రాయితీ 

ఏడు ఫిజియోథెరపీ సెంటర్లు.. రెండు వృద్ధాశ్రమాలు 

సమస్యల పరిష్కారానికి ఎల్డర్‌ లైన్‌ 14567 

సాక్షి, అమరావతి: జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, పిల్లల కోసం ఎంతో కష్టపడి వయస్సు మీద పడిన వృద్ధులకు కావాల్సింది ఓ ఆత్మీయ పలకరింపు. అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అంటూ మలి సంధ్యలో ఉన్న వారి అవసరాలను తీరిస్తే వారికి అదే ఆనందం. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని వయో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద భరోసా అన్నట్లుగా వారి­కి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నారు. అవ్వా.. తాతా.. అంటూ ఆత్మీయతను అందిస్తు­న్నారు. వృద్ధాప్య పింఛన్ల నుంచి వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమంతో పాటు భద్రత, హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. 

గతంలోలా వృద్ధులు పింఛను కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరెవరినో బతిమాలుకోవాల్సిన పని లేకుండా వారు ఉన్న చోటుకే వచ్చి పింఛను డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. గతంలో వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు అనేకం.

సీఎం జగన్‌ ఆ కష్టాల నుంచి అవ్వా తాతలను గట్టెక్కించారు. ఇప్పుడు వలంటీర్లు స్వ యంగా వారు ఉన్న చోటుకు వచ్చి పింఛను డబ్బు అందిస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులే గ్రామాలకు వచ్చి, పరీక్షలు చేసి, మందులు కూడా ఇస్తున్నారు. 

సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్‌ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైఎస్సార్‌ పెన్సన్‌ కానుక అందిస్తోంది. వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లతో మొత్తం 41,05,501 మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి సగటున రూ.13,260.41 కోట్లు వృద్ధులకు పింఛన్‌ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. 

  • ప్రభుత్వం ఏపీఎస్‌ఆరీ్టసీ బస్సుల్లో టిక్కెట్‌ చార్జీ పై 25 శాతం రాయితీ ఇస్తోంది. బస్సుల్లో ముందు డోర్‌ సమీపంలోని మూడు సీట్లు వృద్ధుల కోసం కేటాయించింది. బస్టాండ్లలో వీల్‌చైర్లు అందుబాటులో ఉంచింది. వృద్ధుల కోసం మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) 68 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47,490 మంది వృద్ధులు వీటిని ఉపయోగించుకున్నారు.
  • వృద్ధుల సమస్యలు, అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు 2021 డిసెంబర్‌ నుంచి ఎ ల్డర్‌ లైన్‌ 14567 (హెల్ప్‌లైన్‌) నిర్వహిస్తోంది. 26 జిల్లాల నుంచి 39,332 మంది దీని సేవలు ఉపయోగించుకున్నారు.  

సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ 
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,08,662 మంది వృద్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధుల సంక్షేమంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మలి సంధ్యలో ఎవరూ అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయోవృద్ధుల సమస్యలు, అవసరాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.  – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకులు, రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాగుల సంక్షేమ శాఖ 

5న వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్‌ తొలి సమావేశం 
ఏపీ వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్‌ తొలి సమావేశం అక్టోబర్‌ 5న నిర్వహించనున్నారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిబ్యునల్స్, అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఫిర్యాదుల పరిస్థితి, వారి వైద్య సంరక్షణ, జీవనం, వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు