అన్నదాతను ఆదుకునేందుకే రైతుబంధు

13 May, 2018 06:56 IST|Sakshi
కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో రైతులకు చెక్కులు అందిస్తున్న విప్‌ గంప గోవర్ధన్‌

వారికి కావాల్సింది కరెంట్, నీళ్లు, పెట్టుబడి 

వచ్చే రెండేళ్లలో కాళేశ్వరం సాగునీరు 

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌  

కామారెడ్డి రూరల్‌ : రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం మండలంలోని నర్సన్నపల్లి, క్యాసంపల్లిల్లో రైతులకు చెక్కులను, పట్టాపాసు పుస్తకాలను అందజేశారు. సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన సీఎం కేసీఆర్‌ వారి కష్టాలను గ్రహించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతులకు కావాల్సింది కరెంట్, నీళ్లు, పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే కరెంట్‌ లేక చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన ఆంధ్రోళ్ల మాటలకు రెండున్నరేళ్లలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు, పోచంపాడ్‌ పెద్ద కాలువ నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చే రెండేళ్లలో లక్ష ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

70 ఏళ్లలో ఎంతో మంది సీఎంలు, పీఎంలు, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నారు. 81 ఏళ్ల కింద నైజాం కాలం నాటి భూ రికార్డులను ప్రక్షాళన చేసి నూతనంగా డిజిటల్‌ పాసు పుస్తకాలను అందించడం గొప్ప విషయమన్నారు.  అన్నం పెట్టె రైతన్న ఆనందంగా ఉండాలనే రైతుబంధు పథకంలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. భూమిని నమ్ముకున్న రైతులకు బంగారాన్ని పండించే ధైర్యం ఉందన్నారు.

రాష్ట్ర ఆహార సంస్థ చైర్మన్‌ కొమ్ముల తిర్మల్‌రెడ్డి, సర్పంచ్‌లు కుర్ర ఎల్లయ్య, కట్లకుంట భారతి రాజయ్య, ఎంపీపీ లద్దూరి మంగమ్మలక్ష్మీపతియాదవ్, వైస్‌ ఎంపీపీ పోలీస్‌ క్రిష్ణాజీరావు, మండల ప్రత్యేకాధికారి సిద్దిరాములు, రైతు సమ్వయ సమితి జిల్లా సభ్యుడు మట్టెమల్ల లింగం, ఏఎంసీ చైర్మన్‌ గట్టగోని రాజమణి గోపిగౌడ్, వైస్‌ చైర్మన్‌ గౌరీశంకర్, పిప్పిరి ఆంజనేయులు, ఆకుల నాగభూషణం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, రాజయ్య, ఉపసర్పంచ్‌లు బాలయ్య, రాజిరెడ్డి, ద్యాపరాజు, తహసీల్దార్‌ రవీందర్, డీటీ ప్రేంకుమార్, వీఆర్వోలు పాల్గొన్నారు.

  రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి రూరల్‌ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ లద్దూరి మంగమ్మ అన్నారు. శనివారం మండలంలోని దేవునిపల్లిలో రైతుబంధు చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ పెట్టుబడి పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఈ డబ్బులను కచ్చితంగా ఎరువులు, విత్తనాల కోసం వాడుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు నీళ్లు అందించేందుకు ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుందన్నారు.

వైస్‌ ఎంపీపీ పోలీసు క్రిష్ణాజీరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్టు లింగారావు, గ్రామ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు, మాజీ సర్పంచ్‌ శివాజీ గణేష్‌యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్‌ బల్వంత్‌రావు, మట్టెమల్ల లింగం, ఆకుల నాగభూషణం, గోపిగౌడ్, పిప్పిరి ఆంజనేయులు, మండల ప్రత్యేకాధికారి సిద్దిరాములు, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఆర్‌ఐ నవీన్, వీఆర్వోలు ప్రసాద్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు