వ్యవసాయ కూలి నుంచి ఎంపీపీగా..

5 Jul, 2014 05:30 IST|Sakshi
వ్యవసాయ కూలి నుంచి ఎంపీపీగా..

 చిట్యాల : కాలం కలిసొచ్చింది. కూలి మని‘షి’ని అదృష్టం వరించింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నిన్న మొన్నటి వరకు భర్తకు తోడుగా కూలి పనిచేస్తూ ఆర్థిక అవసరాల్లో అండగా నిలుస్తూ ఇంటిని చక్కదిద్దుకునే ఆమె... ఇప్పటి నుంచి మండలస్థాయి పాలనకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని టేకుమట్ల గ్రామంలో బందెల నరేష్, స్నేహలత దంపతులది సాదాసీదా కుటుంబం. వీరికో పాప ఉంది. ఈ ముగ్గురే కాకుండా నరేష్ అమ్మానాన్న, తమ్ముడు కూడా వీరితోనే ఉంటారు. కాగా, నరేష్ గ్రామంలో సైకిల్‌షాపు నిర్వహిస్తున్నాడు. అలాగే తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
 
ఇంటర్ వరకు చదువుకున్న స్నేహలత ఇంటిపనులకే పరిమితం కాకుండా భర్తకు ఆసరాగా ఉండాలనుకుంది. ఇందులో భాగంగా భర్తతోపాటు రోజు వ్యవసాయ పనులు చేస్తోంది. అయితే వీరికి కొద్దిపాటి భూమి మాత్రమే ఉండడంతో రోజూ పని ఉండకపోయేది. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తుండేది. ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త మలుపు తిప్పాయి. అచ్చొచ్చిన రిజర్వేషన్లు స్నేహలతను ప్రజాప్రతినిధిని చేశాయి. టేకుమట్ల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించాయి. అంతేనా... మండల పరిషత్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాయి. మొన్నటివరకు తమతో కూలి పనికి వచ్చిన స్నేహలత ఎంపీపీగా ఎన్నిక కావడం పట్ల ఆమెతో పరిచయం ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు