సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 9 నాటికి ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఇంకా ఖాళీ చేయని శాఖల కార్యాలయాలను సోమవారంలోగా వాటికి కేటాయించిన భవనాలకు తరలించాలని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత సచివాలయ భవనాలకు విద్యుత్, నీటి సరఫరా వంటి సదుపాయాలను నిలిపి వేస్తామని హెచ్చరించింది.
సచివాలయంలోని అధిక శాతం కార్యాలయాలను సమీపంలోని బీఆర్కేఆర్ భవనానికి, ఇతర కార్యాలయాలను సంబంధిత శాఖల హెచ్ఓడీల భవనాలకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా, దాదాపు 90 కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముగిసింది. మిగిలిన కార్యాలయాలను ఒకట్రెండు రోజుల్లో తరలించనున్నారు. ఆ తర్వాత సచివాలయంలోని భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణ పనులకు సర్కారు శ్రీకారం చుట్టనుంది.