మహిళలకు కేసీఆర్ చేసింది శూన్యం

11 Dec, 2014 23:01 IST|Sakshi
మహిళలకు కేసీఆర్ చేసింది శూన్యం

దుబ్బాక రూరల్ : మహిళా సంఘాలు, వీఓఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది శూన్యమని ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తలపాక కిష్టయ్య అన్నారు. పెండింగ్ వేతనాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండల గ్రామాల వీఓఏలు, మహిళా సంఘాలు సీఐటీ యూ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని హబ్షీపూర్ చౌరస్తాలోని సిద్దిపేట - రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక వారికి రిక్త హస్తం ఇచ్చారని ఆరోపించారు.

మిహళా సమాఖ్యలకు రావాల్సిన  నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దీంతో మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. వీఓఏలకు నెలకు రూ. 2000లు అందజేస్తామని గత ప్రభుత్వం జీఓ జారీ చేసినా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీఓఏలకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించి డిమాండ్ చేశారు. సీఐటీయూ దుబ్బాక డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ భాస్కర్ మాట్లాడుతూ వీఓఏల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తీర్చాలన్నారు. దుబ్బాక పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, మహేష్, జమున, లక్ష్మణ్, సత్తిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించాలి
జోగిపేట : ఐకేపీ వీఏఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహిళలు గురువారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ, మానవహారం, రాస్తారోకోలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలోని శిబిరం నుంచి వందల సంఖ్యలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద మానవహారాన్ని నిర్వహించిన అనంతరం అరగంట పాటు జాతీయ రహదారిపై బైఠాయించారు.

పీ మొగులయ్య మాట్లాడుతూ వీఓఏలకు రావాల్సిన 18 నెలల వేతనాలు చెల్లించాలని, వేతనం రూ.5 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీలేని స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 12 నెలల పావలా వడ్డీలు ఇవ్వాలని అభయ హ స్తం పింఛన్ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేసారు. కార్యక్రమంలో అందోలు మండల వీఓఏల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం అశోక్, గొల్ల మల్లయ్య, నాయకులు అనుసూయ, అనిత, మానస, స్వప్న, అశోక్, సువర్ణ, అరేందర్, లక్ష్మయ్య, మల్లేశం, కిష్టయ్య, బాలయ్యలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు